Home » » Brahmasthra Part One will be Presented by SS Rajamouli

Brahmasthra Part One will be Presented by SS Rajamouli

‘బ్రహ్మాస్త్ర – మొదటి భాగం’ రాజమౌళి దక్షిణాది భాషల సమర్పకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి..



రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, కరణ్ జోహార్, అలియా భట్, అయాన్ ముఖర్జీ కాంబినేషన్‌లో ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌లో వస్తున్న అద్భుతమైన సినిమా బ్రహ్మాస్త్ర. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో బ్రహ్మాస్త్ర విజన్‌ని రాజమౌళి అందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ సౌత్‌లో కూడా అద్భుతంగా మొదలైంది. కొన్ని స్నేహాలు, కొన్ని సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవి. అలా బాహుబలి లాంటి అద్భుతమైన సినిమాతో కలిసిన స్నేహం కరణ్ జోహార్, S.S. రాజమౌళి సొంతం. ఇప్పటికీ ఆ స్నేహం అలాగే కొనసాగుతుంది. తాజాగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమా సౌత్ వర్షన్స్ ప్రజెంట్ చేయడానికి దర్శక ధీరుడు రాజమౌళి వచ్చారు. భారతీయ పురాణాలు అలాగే ఆధునిక ప్రపంచం నుంచి ప్రేరణ పొందిన పురాణ సమ్మేళనం ఈ సినిమా బ్రహ్మాస్త్ర సినిమా. 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ మధ్యే విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్ కూడా తీసుకొచ్చారు. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. 09.09.2022న బ్రహ్మాస్త్ర సినిమా విడుదల కానుంది. ఆ రోజు కచ్చితంగా ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త చరిత్ర మొదలవుతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. మూడు భాగాలుగా వస్తున్న బ్రహ్మాస్త్రలోని మొదటి భాగం అప్పుడే రానుంది. రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి మొదటిసారిగా స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్‌లోకి రాజమౌళి కూడా రావడంతో రేంజ్ ఇంకా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


ఈ సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ.. ‘ప్రపంచ వ్యాప్తంగా నాలుగు దక్షిణాది భాషల్లో బ్రహ్మాస్త్రను ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మాస్త్ర విజన్ చాలా ప్రత్యేకమైనది. ఇది దాని కథ, కథనంలో ప్రతిబింబిస్తుంది. అనేక విధాలుగా ఇది నాకు బాహుబలిని గుర్తు చేస్తుంది. సినిమాపై ప్రేమ, ప్యాషన్ ఉన్న వాళ్లకే ఇలాంటివి సాధ్యమవుతాయి. బాహుబలికి నేను చేసినట్లే అయాన్ ముఖర్జీ కూడా బ్రహ్మాస్త్రను రూపొందించడంలో సమయాన్ని వెచ్చించడం, దాన్ని సరిచేయడానికి ఓపికగా పెట్టడం నేను చూశాను.. ఈ చిత్రం ఆధునిక సాంకేతికతతో పురాతన భారతీయ సంస్కృతికి చెందిన ఇతివృత్తాలను చూపించడంతో పాటు అత్యద్భుతమైన విఎఫ్ఎక్స్‌తో మిమ్మల్ని కట్టి పడేస్తుంది. నేను కూడా ఈ సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. బాహుబలి తర్వాత మరోసారి ధర్మ ప్రొడక్షన్స్‌తో అనుబంధం కలిగి ఉన్నందుకు గర్వపడుతున్నాను. మంచి చిత్రాల పట్ల కరణ్‌కు లోతైన అవగాహన ఉంది. అతనితో మళ్లీ భాగస్వామిగా ఉండటం.. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని అందించడం నాకు గర్వంగా ఉంది..’ అని తెలిపారు.


ఈ సందర్భంగా నాగార్జున అక్కినేని మాట్లాడుతూ.. ‘అయాన్‌తో పాటు బ్రహ్మాస్త్ర చిత్ర బృందంతో కలిసి పనిచేయడం నాకు అద్భుతమైన అనుభవం. పురాతన అలాగే ఆధునిక భారతదేశం యొక్క ఈ కలయిక నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఇలాంటి మ్యాగ్నమ్ ఓపస్‌లో భాగం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ ప్రాజెక్టులో రాజమౌళిని తీసుకురావడం గర్వకారణం. 2022లో ఈ చిత్రాన్ని నా అభిమానులకు అందించడానికి నేను ఎదురుచూస్తున్నాను..’ అని తెలిపారు.


నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ‘బ్రహ్మాస్త్ర అనేది నేను భాగమైన అత్యంత ప్రతిష్టాత్మకమైన, లాంగ్ విజన్ ఉన్న ప్రాజెక్ట్. బ్రహ్మాస్త్ర అయాన్ ప్యాషన్, కష్టానికి శిషువు లాంటిది. అతడు తీసిన విధానం అత్యద్భుతంగా ఉంది.. అలాగే ఫలితం కూడా అసాధారణమైనది.. ప్రెజెంటేషన్ యూనివర్సల్ అప్పీల్‌తో కూడుకుని ఉంది.. పాన్ ఇండియన్ వైడ్‌గా ఇది కచ్చితంగా రావాల్సిన సినిమా. ఇప్పటి వరకు కేవలం రికార్డులు బద్దలు కొట్టడమే కాదు.. భాషా పరమైన సరిహద్దులను కూడా చెరిపేసిన మొట్టమొదటి ఇండియన్ సినిమా బాహుబలి. అద్భుతమైన కథ చెప్పి అందరి మనసులు గెలుచుకున్న రాజమౌళి గారూ.. మా సినిమాలో భాగం అవ్వడంతో ఇంకా నమ్మకం పెరిగింది..’ అని తెలిపారు.


దర్శకుడు అయన్ ముఖర్జీ మాట్లాడుతూ.. ‘బ్రహ్మాస్త్ర అనేది నేను చాలా సంవత్సరాలుగా పెంచుకుంటున్న కల. ఇది ప్రతిష్టాత్మకమైన మూడు భాగాలుగా చేస్తున్న సినిమా. ఇప్పటి వరకు చేసిన ప్రయాణం ఎంతో అద్భుతం. ఈ సినిమా కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. రాజమౌళి గారు ఈ సినిమాలో భాగం అవ్వడం ధైర్యాన్నిచ్చింది. ఆయన చేసిన బాహుబలి సినిమా నా కలను ధైర్యంగా కొనసాగించగలననే నమ్మకాన్ని ఇచ్చింది. అతని పేరును బ్రహ్మాస్త్రానికి జోడించడం అతిపెద్ద గౌరవం..’ అని తెలిపారు.


బ్రహ్మాస్త్ర 3-భాగాల ఫ్రాంచైజీగా రానుంది. మొట్టమొదటి అసలైన విశ్వం ఆస్ట్రావర్స్‌కు నాంది. ఇది భారతీయ పురాణాలలో లోతుగా పాతుకుపోయిన భావనలు, కథల నుంచి ప్రేరణ పొందిన ఒక కొత్త అసలైన సినిమా విశ్వం.. దాన్నే అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో చేస్తున్నారు. ఫాంటసీ, అడ్వెంచర్, మంచి vs చెడు, ప్రేమ, పురాణ కథాంశంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంటుంది. వాటితోనే ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మునుపెన్నడూ ఇండియన్ స్క్రీన్‌పై చూడని ఓ అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఈ సినిమాతో చూడబోతున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ మాగ్నమ్ ఓపస్ 09.09.2022న 5 భారతీయ భాషలు.. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. నాగార్జున అక్కినేని, రణబీర్ కపూర్‌లతో కూడిన ఈ మల్టీస్టారర్ థియేటర్‌లలో విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, అలియా భట్, మౌని రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Share this article :