టీడీపీతో విభేదాలు లేవంటున్న యన్టీఆర్!
తెలుగు దేశం పార్టీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని యంగ్ హీరో యన్టీఆర్ ఈ రోజు ప్రకటించాడు. ఈ విషయంలో 2009 లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాననీ, తన తాత యన్టీఆర్ స్థాపించిన టీడీపీ తోనే జీవితాంతం కొనసాగుతానని ఆయన చెప్పారు. తెలుగు దేశం పార్టీతో యన్టీఆర్ కు విభేదాలు వచ్చాయనీ, యన్టీఆర్ ప్రోద్భలంతోనే వల్లభనేని వంశీ ఇటీవల వైయస్సార్ సీపీ అధినేత జగన్ ని కలిశాడనీ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంపాదించుకుంది.
"నాకు రాజకీయాలు తెలియవు. అసలు రాజకీయాల్లోకి వస్తానో, రానో కూడా తెలియదు. సినిమా అన్నది నా బతుకు తెరువు. వల్లభనేని వంశీ నేను నటించిన 'అదుర్స్' సినిమాకు నిర్మాత మాత్రమే. నేనెప్పుడూ టీడీపీకి విధేయుడనే! పార్టీకి నా అవసరం వున్నప్పుడు నేనే ముందుంటాను" అంటూ యన్టీఆర్ మీడియాకు వివరణ ఇచ్చాడు. త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో యన్టీఆర్ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి తోడు, ఇటీవల విడుదలైన 'దమ్ము' సినిమాను బాలకృష్ణ అభిమానులు ఆదరించడం లేదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో కూడా యన్టీఆర్ నుంచి ఈ ప్రకటన రావడం గమనించదగిన అంశమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు!

Post a Comment