Home » » Pushpa Pre Release Event Held Grandly

Pushpa Pre Release Event Held Grandly

అంగ‌రంగ వైభవంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ ప్రీరిలీజ్ ఈవెంట్



సినిమానే గెల‌వాలి, అన్ని చిత్రాల‌కి ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కాలి - పుష్ప ది రైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సినిమా పుష్ప. డిసెంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా హైదరాబాద్ యూసఫ్ గూడా గ్రౌండ్స్ లో పుష్ప ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మంది అతిరధ మహారథులు హాజరయ్యారు. అలాగే చిత్ర యూనిట్ వచ్చారు.


పుష్ప ప్రీ రిలీజ్ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘అందరికి ఫ్యాన్స్ ఉంటారు.. కానీ నేను గర్వంగా చెప్తున్నాను నాకు ఆర్మీ ఉన్నారు. మీరే నాకు అన్నీ. మీ తర్వాతే నాకు ఎవరైనా. ఈ రోజు చాలా మాట్లాడతాను.. ఎందుకంటే రెండేళ్ళ కష్టం చెప్పుకోవాలి.  సినిమా కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేవి శ్రీ ప్రసాద్, నేను, సుకుమార్ ఒకేసారి జర్నీ మొదలుపెట్టాం. ఇప్పుడు మూడో దశాబ్ధంలోకి వస్తున్నాము. అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చాడు దేవి. ప్రతీ పాట సూపర్‌గా ఉంది. ఈ రోజు నేను దేవి, సుకుమార్ గారిని మిస్ అవుతున్నాను. వాళ్లు సినిమా కోసం కష్టపడుతున్నారని తెలుసు. పుష్ప సినిమా కోసం పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ థ్యాంక్స్. ప్రత్యేకంగా సినిమాటోగ్రఫర్ క్యూబా గారికి స్పెషల్ థ్యాంక్స్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. రష్మిక మందన్నను నేను ముద్దుగా కస్మిక అని పిలుస్తుంటాను. చాలా టాలెంట్ ఉంది ఈ అమ్మాయికి. సరైన కథలు, డైరెక్టర్స్ పడితే ఇంకా ఎత్తుకు ఎదుగుతుంది. సమంత గారికి స్పెషల్ థ్యాంక్స్. సినిమాలో నటించిన ప్రతీ ఒక్క యాక్టర్‌కు థ్యాంక్స్. వాళ్లు అంతా అద్భుతంగా నటించారు. సుకుమార్ గారి గురించి ఏం చెప్పనక్కర్లేదు. సినిమా మాట్లాడుతుంది. ఆయన విజన్ అద్భుతం. చంద్రబోస్ గారూ అద్భుతమైన పాటలు రాసారు. వేటికవే భిన్నమైన పాటలు రాసారు. మొన్న విడుదలై అద్భుతమైన విజయం సాధించిన అఖండ టీమ్ అందరికీ కంగ్రాట్స్. పుష్పతో అది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్, ఆచార్యతో పాటు మధ్యలో వచ్చే సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను..’ అని తెలిపారు.


హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. ‘చాలా రోజులైపోయింది మీ అందర్నీ ఇలా చూసి. అందరూ బాగున్నారా.. అల్లు అర్జున్ సర్‌తో నటించాలనేది చాలా రోజుల నుంచి నా కల. నిజానికి గీత గోవిందం సినిమా ఆడియో లాంఛ్‌కు వచ్చినపుడు అనుకున్నాను.. నాకు ఒక్కసారైనా మీతో నటించే అవకాశం వస్తుందా అని.. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. నేను మీ శ్రీవల్లి ఇప్పుడు. పుష్ప రెండో భాగం కోసం వేచి చూస్తున్నాను. మీతో నటించడం నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుంది సర్. కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. సుకుమార్ గారి వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రెండేళ్లైపోయింది నేను మా అమ్మానాన్నను చూసి. నన్ను దత్తత తీసుకోండి సర్ మీరు. మీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా కచ్చితంగా మీరంతా ఎంజాయ్ చేస్తారు..’ అని తెలిపారు.


ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ.. ‘పుష్ప సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడను. రెండే ముక్కలు చెప్పి స్టేజీ దిగిపోతాను. ఒక సుకుమార్ రెండేళ్లకోసారి జరిగే మహాద్భుతం.. అల్లు అర్జున్ చాలా రోజులుగా తాను చూపించాలని తపన పడుతున్న ఓ విశ్వరూపం.. నా కలల ప్రతిరూపం.. దేవి మూడో దశాబ్ధంలో కూడా మన కర్ణబేరిపై కూర్చుని వాయిస్తున్న ఓ మధుర మృదంగం.. రష్మిక.. గీతా ఆర్ట్స్‌లో పుట్టిన చిన్న సితార.. మేమంతా గర్వపడేంత ఎత్తుకు ఎదిగిన ధృవ తార.. మైత్రి చాలా మందికి వీరంటే ఇష్టం.. నొప్పించక తానొవ్వక పరిగెత్తడం చాలా కష్టం. కానీ వీళ్లు ప్రథమ స్థానానికి చేరడం స్పష్టం.. ఇలా సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.. డిసెంబర్ 17న సినిమా గురించి మీరే మాట్లాడతారు..’ అంటూ తెలిపారు.


పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు కొరటాల శివ.. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ' ఇలాంటి ఒక అందమైన ప్రపంచం.. అద్భుతమైన యూనివర్స్ క్రియేట్ చేయాలి అంటే కేవలం సుకుమార్ కు మాత్రమే సాధ్యమవుతుంది. తొలి సినిమా నుంచి సుకుమార్ డెడికేషన్ చూస్తున్నాను. ఈరోజు ఆయన తరఫున నేను మాట్లాడడానికి వచ్చాను. ఈ మాటలు నావి కావు సుకుమార్ వి. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసిన టెక్నికల్ టీమ్ కు కృతజ్ఞతలు చెబుతున్నాను. డి గ్లామర్ రోల్ చేసినా కూడా రష్మిక మీరు చాలా అందంగా ఉన్నారు. ఇక ఒక సినిమా కోసం ఇంతగా ప్రాణం పెట్టి పని చేసే నటుడు ఇండియాలో మరెవరూ ఉండరు. మీ డెడికేషన్ కు నిజంగా సలాం బన్ని గారు. మీరు ఎంత గొప్ప నటుడు అనేది పుష్ప విడుదల తర్వాత ఇంకా అర్థమవుతుంది. పుష్ప 2 తర్వాత ఇంతకంటే అద్భుతమైన కథతో మిమ్మల్ని కలుస్తాను. ఆయనకు సినిమా తప్ప మరో ధ్యాస ఉండదు. ఖచ్చితంగా డిసెంబర్ 17 ఫస్ట్ డే మార్నింగ్ షో నేను అక్కడ ఉంటాను. ఆల్ ద బెస్ట్ బన్ని గారు.. సుక్కు బాయ్.. ఈ ఒక్క మాట నాది..' అంటూ ముగించారు దర్శకుడు కొరటాల శివ.


పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ చిత్ర యూనిట్ అందరూ హాజరయ్యారు. ఈ సినిమాలో మంగళం శ్రీను పాత్రల్లో నటించిన సునీల్.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎనర్జిటిక్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ' ఇదే వేదికపై అల వైకుంఠపురంలో సినిమా గురించి ఒక మాట చెప్పాను.. చక్కటి విందు భోజనంలా ఉంటుంది మీరు టికెట్ కొట్టుకుని వస్తే చాలు.. పండక్కి మీ ముందుకు వస్తున్నాము అని చెప్పాను. ఇప్పుడు అదే చెబుతున్నాను ఇది పెళ్లి తర్వాత వచ్చే రిసెప్షన్ లాంటి సినిమా. కక్క ముక్క బాగా ఉంటుంది. మంచి నాన్ వెజ్ మీల్స్ లాంటి సినిమా పుష్ప. ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా వారంరోజుల పాటు మిమ్మల్ని బాగా హాంట్ చేయడం ఖాయం. సాధారణంగా ఎవరైనా విలన్ అవ్వాలంటే నేరుగా అయిపోతారు. కానీ నేను 300 సినిమాలు కమెడియన్ గా చేసి.. అందులో 10 సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత విలన్ అయ్యాను. దయచేసి నా ముందు సినిమాలను గుర్తుపెట్టుకుని ఈ సినిమా చూడకండి. అల్లు అర్జున్ ఫోటో తీసుకెళ్ళండి. నా గతం గుర్తుకు వస్తే వెంటనే బన్నీ ఫోటో చూడండి. మీరు కొత్తగా చూస్తేనే కొత్తగా చేయగలను. ఖచ్చితంగా పుష్ప సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు..' అని తెలిపారు.


ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యారు. తనకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన దర్శకుడు సుకుమార్ అని.. ఆయన ఈ రోజు ఇక్కడ లేకపోవడం కొద్దిగా బాధ అనిపిస్తుందని తెలిపారు రాజమౌళి. తామిద్దరం ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటామని.. ఒకరి గురించి ఒకరం చర్చించుకుంటామని.. ఈ మధ్య ఎక్కువగా బాంబేకి వెళ్లినప్పుడు అందరూ పుష్ప సినిమా గురించి అడుగుతున్నారని చెప్పారు రాజమౌళి. ఖచ్చితంగా అక్కడ కూడా బాగా ప్రమోట్ చేసుకోవలని.. సినిమా అద్భుతంగా వచ్చిందని ఆయన ప్రశంసించారు. ఇది తెలుగు సినిమా.. ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళనివ్వాలి.. అందులో ఇండస్ట్రీ స్వార్థం కూడా ఉందని తెలిపారు ఆయన. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పెట్టిన డెడికేషన్ గురించి ప్రత్యేకంగా తాను చెప్పాల్సిన అవసరం లేదని.. పుష్ప సినిమా ఖచ్చితంగా అద్భుతమైన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు రాజమౌళి.


పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ' అల్లు అర్జున్ అంటేనే ఎనర్జీ.. ఆయన ఫ్యాన్స్ కూడా అంతే. చాలా రోజుల తర్వాత ఇంత మంది జనాన్ని చూడడం ఆనందంగా ఉంది. సినిమా కోసం బన్నీ ప్రాణం పెడతాడు. వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ స్టామినా ఏమిటో తెలుస్తోంది. మొన్న కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి తాను అల్లు అర్జున్ అభిమాని అంటూ గర్వంగా చెప్పినప్పుడు నేను కూడా గర్వంగా ఫీల్ అయ్యాను. బన్నీ తెలుగు వాడు అయినందుకు అందరం గర్వపడాలి. పుష్ప సినిమా కచ్చితంగా అద్భుతమైన విజయం సాధిస్తుంది..' అని తెలిపారు.


పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ' నా గురువు సుకుమార్ గారి గురించి ప్రత్యేకంగా నేనేం చెప్పలేను. ఈరోజు ఆయన ముంబైలో మిక్సింగ్ లో బిజీగా ఉన్నారు. మీరు కూడా రండి సార్ అంటే.. మన అందరి కంటే సినిమా పెద్దది రా అన్నారు. సినిమా చేసిన వాడు పోతాడు.. చూసినవాడు పోతాడు కానీ సినిమా శాశ్వతం అంటుంటారు మా గురువుగారు. పుష్ప సినిమా కచ్చితంగా అల్లు అర్జున్ కెరీర్ లో ప్రత్యేకంగా మిగిలిపోతుంది. బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి సుకుమార్ గారు ఎప్పుడు ముందుంటారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కోసం వేచి చూస్తున్నాను..' అని తెలిపారు


Share this article :